పోతన భాగవతము (సరళ గద్యానువాద సహితము)
మొదటి స్కంధము
శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్, లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభకు, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్.
తాత్పర్యము: అక్షరమైన మోక్ష సంపదను ఆపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి ఐన ఆనందగోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోదా కిశోరుడు సామాన్యుడు కాడు; ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ఎల్లలోకాలనూ చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతే కాదు. కన్నతల్లి ఒడిలో ఒయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్కమాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు, ఎన్నెన్నో బ్రహ్మాండభాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయట.
0 comments:
Post a Comment